విజయం సాధించాలంటే పట్టుదల అవసరం: పది టాపర్లకు జిల్లా కలెక్టర్ అభినందనలు

Madupa Santhosh CEO

 NRML: విజయం సాధించాలంటే పట్టుదల అవసరం: పది టాపర్లకు జిల్లా కలెక్టర్ అభినందన.
నిర్మల్ : అక్షరతెలంగాణ
     కష్టపడితే ఏదైనా సాధ్యం. విజయానికి పట్టుదలే పునాది అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ప్రభుత్వ బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాల, ఖానాపూర్‌కు చెందిన జాదవ్ ఈశ్వర్ 561 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలవగా, భుక్యా గౌతమ్ 558 మార్కులు సాధించి ప్రతిభను చాటాడు. గురువారం జిల్లా కలెక్టర్ విద్యార్థులను స్వయంగా కలెక్టరేట్ లోని తన ఛాంబరులో శాలువాలతో సత్కరించి, మిఠాయిలు తినిపిస్తూ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థుల విజయం గర్వించదగిన విషయమన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషికి ఇది నిదర్శనమని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యా విధానం వల్లే ఈ ప్రతిభ వెలుగులోకి వచ్చింది అని వివరించారు. ఈ ఫలితాలు జిల్లా యంత్రాంగానికి నూతన ఉత్తేజానిస్తాయని పేర్కొన్నారు. కష్టపడితే ఎలాంటి లక్ష్యానికైనా చేరుకోవచ్చని, జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలంటే పట్టుదలతో చదవాలంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.
       ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ, సీపీఓ జీవరత్నం, వ్యాయామ ఉపాధ్యాయులు భుక్యా రమేష్, ఇతర ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Comments