అదిలాబాద్: అక్షర తెలంగాణ
నిమజ్జన ఉత్సవాల్లో అధిక శబ్దం వచ్చే డీజేలకు అనుమతి లేదు.
నిమజ్జన సమయంలో చెరువులు, వాగులు, నదుల వద్ద అప్రమత్తంగా ఉండాలి.
గణపతి నిమజ్జనంలో ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి.
నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు.
ట్రాక్టర్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపవద్దు.
ఆదిలాబాద్ జిల్లాలో గణపతి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. గణపతి ఉత్సవ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సుమారు 200 మంది పాల్గొన్నారు.
నిమజ్జన ఉత్సవాల్లో అధిక శబ్దం వచ్చే డీజేలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిమజ్జన సమయంలో చెరువులు, వాగులు, నదుల వద్ద భద్రతా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకుండా నిర్వాహకులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో ఇప్పటికే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జన మార్గాల్లో రోడ్లపై విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గణపతి నిమజ్జనానికి వెళ్లే ట్రాక్టర్ డ్రైవర్లు మద్యం సేవించకుండా వాహనాలను నడపాలని, వాహనాలపై పరిమితికి మించి వ్యక్తులను ఎక్కించుకోవద్దని సూచించారు. ఉత్సవాలను నిర్ణీత సమయంలో ప్రారంభించి, సకాలంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరారు. నిమజ్జనానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. గణపతి నిమజ్జన ఉత్సవాలను పవిత్రంగా, నిష్ఠతో, భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని అన్నారు. మహిళల పట్ల ఆకతాయిలు వేధింపులకు పాల్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గణపతి మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు పరస్పరం పోటీ పడకుండా సమన్వయంతో, సామరస్యంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏ ఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు లచ్చన్న, విద్యుత్ శాఖ డి.ఇ కె. నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎం.వెంకట నర్సయ్య, పట్టణ సి ఐ లు, ఎస్ ఐ లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, గణపతి మండప కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments