త్రివేణి సంగమం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కాళేశ్వరంలో సంగమిస్తాయి. ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామం, ధ్యానం, సంధ్యా వందనంతో తపస్సు చేసే శక్తిని పెంపొందించుకునే వారని స్కంధ పురాణం చెబుతోంది. పూర్వం కాకతీయుల గురువులు, ఆరాధ్యులు ఉండేవారని చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజులు విజయాలు పొందినప్పుడు ప్రథమంగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునే వారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. నదులకు పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం మూడు పుష్కరాలు వస్తుంటాయి. 2015లో గోదావరి పుష్కరాలు జరుగగా తిరిగి 2027లో, 2010లో ప్రాణహిత పుష్కరాలు నిర్వహించగా 2022లో పుష్కరాలు వస్తాయి, సరస్వతి నదికి 2013లో పుష్కరం రాగా 2025లో తిరిగి వస్తాయి.
తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం, దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది.
ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై లింగాకృతిలో యముడు, శివుడు కలిసి ఉండడం విశేషం. కాలుడు, ఈశ్వరుడు కొలువై ఉండడంతో కాళేశ్వరంగా పేరు వచ్చిందని చెబుతారు. భక్తులు ముందుగా యమ లింగాన్ని, వెంటనే శివ లింగాన్ని అభిషేకిస్తూ, స్పర్శ దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని అనాది నుంచి నమ్ముతున్నారు. యమలోకంలో పాపాత్ములు తగ్గి ఉక్కు స్తంభం చల్లారిపోయి ఆయుధాలు తుప్పు పడుతుండడంతో శివుని అనుగ్రహం పొందేందుకు యముడు తపస్సు చేశారని స్కంధ పురాణాలు చెబుతున్నాయి. ఆయన తపస్సుకు మెచ్చి కాళేశ్వర క్షేత్రంలో శివుడి పక్కనే లింగాకారంగా వెలుస్తావని యముడు వరం పొందాడని చరిత్ర చెబుతోంది.
తెలంగాణ కాళేశ్వరం లో పుష్కరాలు
గోదావరి, ప్రాణహిత నదులు కలిసే పవిత్రమైన కాళేశ్వర క్షేత్రంలో.. అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మే సరస్వతీ నదికి రానున్న నెలలో పుష్కరాలు జరగనున్నాయి. అయితే.. మే నెలలో తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉండటంతో పాటు.. పుష్కర స్నానాలకు అత్యంత ముఖ్యమైన గోదావరి నది వేగంగా ఎండిపోతుండటం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. పుష్కరాలు ప్రారంభం కావడానికి మరో 34 రోజులు మాత్రమే ఉండటంతో.. అప్పటికి నదిలో నీరు దాదాపుగా ఇంకిపోయే ప్రమాదం కనిపిస్తోంది. నదిలో నీరే లేకపోతే లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఎలా ఆచరిస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఈ సరస్వతీ పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సరస్వతీ పుష్కరాలు కావడంతో ప్రభుత్వం దీనిని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా భావిస్తోంది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారుల బృందం ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు వెళ్లి అక్కడ నిర్వహించిన మహాకుంభమేళా నిర్వహణ తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసి వచ్చింది.
కోట్లాది మంది భక్తులు హాజరైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ చేసిన ఏర్పాట్లను
పరిశీలించింది. వచ్చే ఏడాది.. ఆ తర్వాత ఏడాది గోదావరి, కృష్ణా నదులకు కూడా పుష్కరాలు జరగనున్నాయి. వాటికి ముందు జరగనున్న ఈ సరస్వతీ పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో జరగబోయే పెద్ద పుష్కరాలకు ఒక మంచి పునాది వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులు నిమగ్నమయ్యారు.
పుష్కరాలకు అత్యంత కీలకమైన నదీ జలాలే అందుబాటులో లేకపోతే ఎలా అనే క్లిష్టమైన సమస్య ఇప్పుడు అధికారులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో.. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు నీటిపారుదల శాఖ అధికారులతో అత్యవసరంగా సమావేశమై ఈ విషయంపై చర్చలు జరిపారు. ప్రస్తుతం గోదావరి నది దాదాపుగా అడుగంటిపోయింది. ప్రాణహిత నదిలో మాత్రం కొంత నీటి ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరం దేవాలయం సమీపంలోని నదీ గర్భంలో తాత్కాలికంగా ఒక అడ్డుకట్టను నిర్మించి నీటిని నిల్వ చేసి పుష్కర స్నానాల కోసం ఉపయోగించాలనే ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ.. మే నెలలో ఉండే తీవ్రమైన ఎండల కారణంగా నిల్వ చేసిన నీటిలో బూగీన్ ఆలే బ్యాక్టీరియా ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నీటిలో స్నానం చేస్తే భక్తులకు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ఆలోచన ఆచరణ సాధ్యం కాదని భావిస్తున్నారు.
దీనికి ప్రత్యామ్నాయంగా.. కాళేశ్వరం దేవాలయానికి ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి నదిలో స్నానాలకు సరిపడా నీరు ఉండేలా చూడాలనేది మరొక ఆలోచన. అయితే.. ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం దేవాలయానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం గోదావరి నదిలో అనేక పెద్ద గుంతలు ఏర్పడి ఉన్నాయి.
ఎల్లంపల్లి నుండి విడుదల చేసే నీరు ఈ గుంతలన్నింటినీ నింపితేనే ప్రవాహం ముందుకు సాగుతుంది. అంతేకాకుండా.. నదిలో ఇసుక మేటలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రవాహంలో వచ్చే చాలా నీరు భూమిలోకి ఇంకిపోయే ప్రమాదం ఉంది. పుష్కరాల సమయంలో ఉండే ఎండల కారణంగా ప్రవాహంలో నీరు ఆవిరయ్యే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితులను తట్టుకొని నీరు కాళేశ్వరం దేవాలయం వరకు చేరాలంటే నిత్యం కనీసం 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. అయితే.. అంత పెద్ద మొతంలో నీటిని విడుదల చేయడం అంత సులభం
కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితిని అధిగమించడానికి అధికారులు మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. నదిలో శక్తివంతమైన బోర్లు వేయించడం ద్వారా నీటిని పైకి లాగి తాత్కాలికంగా కొలనులను ఏర్పాటు చేసి వాటిని నీటితో నింపాలనేది ఒక ఆలోచన. మరొక ఆలోచన ఏమిటంటే.. ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి పుష్కర ఘాట్ల వద్ద షవర్లను ఏర్పాటు చేసి స్నానాలకు ఏర్పాట్లు చేయడం. ఈ ప్రతిపాదనలపై త్వరలో ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భక్తుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
రోడ్డు ద్వారా ప్రయాణం చేసేవారు.
తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కాళేశ్వరంకి నేరుగా బస్సులను నడుపుతుంది.
మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లేదా జూబ్లీ బస్టాండ్ నుండి ఈ బస్సులు ప్రతి రోజు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా ఎక్స్ప్రెస్ సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది. ప్రయాణ సమయం 4 - 5 గంటలు పట్టవచ్చు. కారు మార్గం లేదా బైక్ మార్గం: హైదరాబాద్ -సిద్దిపేట - పెద్దపల్లి - కాళేశ్వరం ( 300 కిలోమీటర్లు, 5 గంటల సమయం), హైదరాబాద్ - బొంగిర్ - వరంగల్ - పర్కాల్ -కాళేశ్వరం ( 260 కిలోమీటర్లు, 4 గంటల 15 నిమిషాలు
రైలులో ప్రయాణించే వారు.
కాళేశ్వరంలో రైల్వే స్టేషన్ లేదుకనుక సమీప రైల్వే స్టేషనైన మంచిర్యాల, రామగుండం (98 కిలోమీటర్లు)లో దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు.
రాముగుండం నుండి కాళేశ్వరానికి అధిక సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి. వరంగల్ మరియు కాజీపేట్ రైల్వే స్టేషన్ లు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
వాయు మార్గంలో ప్రయాణించే వారు.
హైదరాబాద్ కు వెళ్లి కారు, రైలు లేదా బస్సులో ప్రయాణించండి. ప్రత్యామ్నాయంగా, నాగ్ పూర్. వాయు మార్గంలో, ఆపై కారును కాళేశ్వరానికి తీసుకెళ్లండి. కాళేశ్వరం 214 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హెచ్వైడి), హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. కాళేశ్వరం 275 కిలోమీటర్ల దూరంలో సోనెగావ్ విమానాశ్రయం (ఎన్ ఎ జి), నాగ్ పూర్ (మహారాష్ట్ర)
సేకరణ .... మడుప సంతోష్ ...సంపాదకులు..!
Comments