ఆదిలాబాద్: అక్షరతెలంగాణ
చనాక–కోరాట పంప్ హౌస్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ.
ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామంలోని చనాక–కోరాట బ్యారేజీ పంప్ హౌస్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చనాక-కోరాట ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతున్నందున ఎటువంటి లోపాలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రతా, ప్రోటోకాల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. హేలీపాడ్ వద్ద అగ్నిమాపక, వైద్య సిబ్బంది ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఎస్పీ మాట్లాడుతూ, భద్రత కారణాల దృష్ట్యా గుర్తింపు కార్డులతో పాటు పాస్ లు ఉన్న వారిని అనుమతించడం జరుగుతుందని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందనీ, అందుకు గ్రామస్తులు, అధికారులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
అంతకుముందు కలెక్టర్, ఎస్పీలు హెలిపాడ్ ప్రాంతాన్ని, పంప్ హౌస్, ప్రధాన కాలువ, ప్రధాన కాలువ డెలివరీ సిస్టమ్ (DC) వద్ద జరగబోయే పూజా కార్యక్రమ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆదిలాబాద్ ఆర్డీఓ స్రవంతి, నీటి పారుదల శాఖ ఎస్ఈ విశ్వ కళ్యాణ్, ఇంజనీర్లు, తహసీల్దార్లు రాజేశ్వరి, శ్రీనివాస్, అగ్ని మాపక, వైద్య, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments